టీడీపీ0 జనసేన, బీజేపీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి 224 ఎన్నికలలో పోటీ చేసి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు పార్టీల కలయికలో ఏర్పడిన కూటమిలో పార్టీలవారిగా సీట్లు, పదవుల సర్దుబాటు కత్తి మీద సాము వంటిది. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, రాజ్యసభ స్థానాల పంపకాల విషయంలో మూడు పార్టీలకు చెందిన కొందరు నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది అన్నది బహిరంగ రహస్యమే. అయితే తాజాగా అసంతృప్తిని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ బహిరంగ వేదికపై వెళ్లగక్కిన వైనం తీవ్ర చర్చనీయాంశమైంది.
2019-24 మధ్య కాలంలో పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, అయినా తనకు మంత్రి పదవి దక్కలేదని ఉమ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. అంతేకాదు, వైసీపీ నుంచి వచ్చిన కొలుసు పార్థసారధికి మంత్రి పదవి దక్కిందని ఉమ వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసం తాను ఏ విధంగా పనిచేశానో అందరికీ తెలుసు, అయినా సరే పార్టీ మారిన నేతలకు పదవులిచ్చారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఉమ. పార్థ సారధి, కొండపల్లి శ్రీనివాస్, సవిత ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్నించారు.
కొత్తవాళ్లకు పదవులిచ్చారని, వారు ముందుకు వెళుతున్నారు కొందరు తన దగ్గర ప్రస్తావించారని ఉమ చెప్పారు. అయితే, అది పార్టీ విధానం అని, ఉదాహరణకు తననే కావాలని అన్నారు. మాచర్లలో, గుడివాడలో తనపై దాడి జరిగింది, అయినా భయపడకుండా, ఎక్కడా తగ్గకుండా పనిచేశానని గుర్తు చేశారు. అయినా సరే, తనకు మంత్రి పదవి రాలేదని, వైసీపీ నుంచి పార్థసారధికి మంత్రి పదవి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. అదే విధంగా, కొండపల్లి శ్రీనివాస్, సవిత, సుభాష్..వీళ్లందరికీ మంత్రి పదవులొచ్చాయని, వారంతా ఎక్కడి నుంచి వచ్చారని అన్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే 15 మంది పేర్లు చెప్పొచ్చని, కానీ, వాటి గురించి ఆలోచన చేయకూడదని చెప్పారు. అటువంటివి జరుగుతూ ఉంటాయని, అది పార్టీ నిర్ణయం అని, చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నందున దానిని తాను అమలు చేస్తున్నానని చెప్పారు. అదే విధంగా తాను ఒక నిర్ణయం తీసుకున్నానని, దానిని గౌరవించాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని టీడీపీ నేతలనుద్దేశించి ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల ఎన్డీఏ పాలనపై నివేదిక నిర్వహించిన సభలో ఉమ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ కామెంట్లపై టీడీపీ అధిష్టానం రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

