రాజస్థాన్: రాజస్థాన్లోని జైపూర్ సవాయ్ మాన్సింగ్(SMS) ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. ప్రైవేట్ పార్ట్ కోల్పోయిన యువకుడికి కొత్త జన్మ ప్రసాదించారు. 29 ఏళ్ల యువకుడికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి మర్మాంగాన్ని తిరిగి అతికించారు. 40 రోజుల చికిత్స తర్వాత ఆపరేషన్ 100 శాతం విజయవంతమైంది.
అసలేం జరిగింది:
వ్యక్తిగత గొడవల నేపథ్యంలో మే 31న యువకుడిపై అతడి ప్రియురాలు దాడి చేసింది. బ్లేడ్తో అతడి మర్మాంగాలు కోసేసింది. తీవ్రంగా గాయపడిన అతడిని 4 గంటల్లోపే జైపూర్లోని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడంతో కోల్పోయిన అవయవాన్ని తిరిగి కాపాడగలిగారు.
రోగిని పరీక్షించిన వెంటనే ప్లాస్టిక్ సర్జరీ విభాగం అత్యవసర మైక్రోసర్జరీ చేసింది. గంటల పాటు సాగిన ఈ క్లిష్టమైన సర్జరీలో తెగిన అవయవాన్ని తిరిగి అతికించారు. శస్త్రచికిత్స సమయంలో దెబ్బతిన్న మూత్రనాళం, కార్పొరా కావెర్నోసా, కార్పస్ స్పాంజియోసమ్ వంటి సున్నిత భాగాలను అత్యంత జాగ్రత్తగా పునర్నిర్మించారు. శస్త్రచికిత్స తర్వాత రోగిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
సుమారు 40 రోజుల తర్వాత అతను సాధారణంగా మూత్రవిసర్జన చేయగలుగుతున్నాడని, జననాంగం కూడా సాధారణ పనితీరును పూర్తిగా తిరిగి పొందాడని వైద్యులు కనుగొన్నారు. ఇలాంటి కేసుల్లో ప్రతీ నిమిషం కూడా కీలమని వైద్యులు చెబుతున్నారు. గాయమైన వెంటనే ఆసుపత్రికి తీసుకురాకపోతే అవయవాన్ని కాపాడటం కష్టమవుతుందని చెప్పారు.

