కృష్ణానదిలో 100 పడవలతో వినూత్న ర్యాలీ…
నిధులు విడుదల చేసినందుకు సీఎంకు మత్స్యకారుల కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మత్స్యకారులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మత్స్యకార భరోసా సంక్షేమ పథకం కింద నిధులు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపేందుకు వందలాది మంది మత్స్యకారులు సుమారు 100 మంది పడవల్లో కృష్ణానది మీదుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా నదిలో పడవల ర్యాలీతో సందడి చేశారు.పడవలపై తరలివచ్చిన మత్స్యకారులను రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆత్మీయంగా ఆహ్వానించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రజాప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలిపారు. వారి అభిమానానికి మంత్రి లోకేష్ చలించిపోయారు. ఈ ఘటనపై నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. ఎంమత్స్యకారుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చాను. గంగపుత్రులు చూపిన ఈ అరుదైన కృతజ్ఞత, వారి అభిమానం వెలకట్టలేనిది అని లోకేష్ పేర్కొన్నారు. ఈ చిత్రాలకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల మత్స్యకారులు వ్యక్తం చేసిన ఆనందం ఇప్పుడు చర్చనీయంగా మారింది.

