మహిళల క్రికెట్లో బిహార్ అండర్ 19 ప్లేయర్, 19 ఏళ్ల అక్షర గుప్తా చరిత్ర సృష్టించింది. 126 బంతుల్లో 306 పరుగులతో వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. బీహార్ క్రికెట్ అసోసియేషన్ అండర్-19 మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో అక్షర గుప్తా ట్రిపుల్ సెంచరీతో చెలరేగింది. ఈ టోర్నీ ప్రారంభమైన తొలి రోజే అక్షర గుప్త ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది.
233 నిమిషాల పాటు క్రీజులో నిల్చొన్న అక్షరం.. కేవలం 126 బంతుల్లో 242.86 స్ట్రైక్రేట్తో 306 పరుగులతో అజేయంగా నిలిచింది. 55 ఫోర్లతో పాటు 8 సిక్సర్లు బాదింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆమె.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 34 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. ఆమె బ్యాటింగ్ విధ్వంసం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
అక్షర గుప్తా బ్యాటింగ్కు ఆశ్చర్యపోయిన బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హర్ష్ వర్ధన్, సెక్రటరీ జియావుల్ అర్బిన్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. బిహార్ క్రికెటర్లు రాష్ట్రం గర్వపడేలా ఆడ, ప్రారంభ మ్యాచ్లో ఇలాంటి ఘనత సాధించడం బీహార్ క్రికెట్ ఉజ్వల భవిష్యత్తును సూచిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
భారత దేశవాళీ మహిళా క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ముంబైకి చెందిన ఇరా గుప్తా పేరుతో ఉంది. ఆమె ఒక రాష్ట్ర స్థాయి మ్యాచ్లో 42 ఫోర్లు, 16 సిక్సర్లతో 346 పరుగులతో అజేయంగా నిలిచింది. తాజాగా అక్షర గుప్తా 306 పరుగులు చేసి మహిళల క్రికెట్లో ఒక కొత్త మైలురాయిని అందుకుంది. బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహిళా క్రికెట్లో అక్షర గుప్తా అతని తరహా విధ్వంసంతో వార్తల్లో నిలిచింది.
కథనం మొదట ప్రచురించబడింది: గురువారం, జూన్ 18, 2026, 18:31 (IST)
ఇతర కథనాలు ప్రచురించబడ్డాయి జూన్ 18, 2026

