అమర్నాథ్: జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతంలో ప్రతి ఏడాది మంచు శివలింగం ఏర్పడుతుంది. అమర్నాథ్ గుహలో ఈ శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు. ఫలితంగా అమర్నాథ్ యాత్ర భక్తుల కోలాహలం మధ్య జరుగుతూ ఉంటుంది. అక్కడి వాతావరణం సహకరించకపోయినప్పటికీ.. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేనప్పటికీ యాత్రికులు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతారు.
మంచు శివలింగం ప్రతి ఏడాది నాలుగు నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కరిగిపోతూ ఉంటుంది. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవలి క్లౌడ్ బరస్ట్ మినహా మిగిలిన సమయంలో అంతగా వర్షాలు కురవలేదు. రికార్డు స్థాయిలో అక్కడ స్థాయిలు నమోదయ్యాయి. వాతావరణంలో కూడా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులు అమరనాథుడి మీద కూడా పడుతోందని అక్కడి అధికారులు చెబుతున్నారు..
మంచు శివలింగం కరిగిపోతున్న నేపథ్యంలో ఈసారి అమర్నాథ్ యాత్ర త్వరగానే ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయని 3న యాత్ర మొదలైంది. కేవలం ఐదు రోజుల్లోనే మంచు శివలింగం భారీగా కరిగిపోవడం విశేషం. వేలాదిమంది భక్తులు ఇప్పటికే యాత్రలో ఉన్నారు. శివలింగం కరిగిపోతే వారు అమరనాథుడిని దర్శించుకునే అవకాశం ఉండదు.. పైగా హిమాలయ ప్రాంతాలలో సహజ సిద్ధమైన మంచుకొండలు.. అక్కడి నదులు గ్లోబల్ వార్మింగ్ వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
వేడి వల్ల.. వాతావరణంలో మార్పుల వల్ల.. గాలుల తీవ్రత వల్ల ఇక్కడ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అందువల్లే మంచు కరిగిపోతుంది. అమర్నాథ్ గుహలు సముద్రమట్టానికి 3880 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇక్కడ శివలింగం 12 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. శివలింగం కరిగిపోవడం ఇటీవల కాలంలో తరచుగా జరుగుతూనే ఉంది. అందువల్ల భక్తులకు ఆశించిన స్థాయిలో శివుడి దర్శన భాగ్యం లభించడం లేదు. వాతావరణ మార్పుల వల్లే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

