ఈ సంవత్సరం పండుగలు: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తాయి. దీనితో ప్రతి ఇంట్లో, దేవాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. భక్తులు పూజలు, వ్రతాలతో నిత్యం దైవ నామస్మరణ చేస్తారు. అయితే 2026 ఏడాదిలో ఏ తేదీలలో ఏ పండుగలు వస్తాయో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఏ తేదీలో ఏ పండుగలు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..
జూలై 25న తొలి ఏకాదశి తర్వాత ఇదే నెలలో 29న గురు పౌర్ణమి రాబోతుంది. గురువును దైవ స్వరూపంగా భావించి ఈ రోజున తమకు విద్యను, జ్ఞానాన్ని అందించిన వారికి ప్రత్యేకంగా సత్కరిస్తారు. వారి ఆశీస్సులు పొంది భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. అలాగే ఈరోజు సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి.
శ్రావణమాసం ప్రారంభం కాగానే ఆగస్టు 18న మంగళ గౌరీ పూజను నిర్వహించనున్నారు. వివాహితులు తమ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటూ ఈ వ్రతంతో ఆయా ఇళ్లల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అలాగే ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. లక్ష్మీదేవిని వరలక్ష్మీ రూపంలో పూజిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే కొన్ని పంచాంగాల్లో వరలక్ష్మి వ్రత తేదీని 28న కూడా నిర్వహించాలని చెప్పారు. ఈ వ్రతాన్ని పాటించేవారు సమీప పండితులను సంప్రదించి నిర్వహించుకోవాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుక ఆగస్టు 28న నిర్వహించనున్నారు. ఈ రోజున సోదరుడికి సోదరి రాఖీ కట్టి తమ ప్రేమను తెలియజేస్తుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా కలిసి సంతోషంగా గడుపుతారు. సెప్టెంబర్ 14న వినాయక చవితిని నిర్వహించనున్నారు. ఆది దేవుడిగా పిలిచే వినాయకుడిని ఈరోజు వాడవాడలా ప్రతిష్టించి నవరాత్రులు నిర్వహించనున్నారు.
తెలంగాణతో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా నిర్వహించే దసరా పండుగ అక్టోబర్ 20న రానుంది. అయితే దీనికంటే ముందు తెలంగాణలో బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోనున్నారు. అయితే సద్దుల బతుకమ్మ తేదీని ఆయా ప్రాంతాలను బట్టి తేదీలు మారుతూ ఉంటాయి. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా తొమ్మిది రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.
అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను నిర్వహించనున్నారు. ఈ ఏడాదిలో దీపావళి వేడుకలు నవంబర్ 8న ఉన్నాయి. ఈ రోజున లక్ష్మీ పూజలు నిర్వహిస్తూ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. డిసెంబర్ 20న ముక్కోటి ఏకాదశి జరుపుకుంటున్నారు. వైష్ణవ ఆలయాల్లో ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణువును దర్శించుకుంటారు.
ఇవే కాకుండా కొన్ని ప్రత్యేక పర్వదినాలు కూడా రానున్నాయి. వరుస పండుగలతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయా రోజుల్లో శుభకార్యాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది.

