ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి కోటపై సుప్రీం అసంతృప్తి
సమాజంలో ఒకసారి ఆర్థిక, సామాజిక ఎదుగుదల వచ్చాక కూడా మళ్లీ రిజర్వేషన్లు కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొంది విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు ఇంకా కోటా ఎందుకని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లోని ‘క్రీమీ లేయర్ మినహాయింపులపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ”తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు అయితే, వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్లు ఎందుకు? విద్యాపరమైన, ఆర్థికపరమైన సాధికారత వచ్చినప్పుడు సమాజంలో హోదా దానంతట అదే మారుతుంది. ఒకసారి విద్యా, ఆర్థిక ఎదుగుదల ద్వారా సామాజిక మార్పు వచ్చాక.. మళ్లీ వారి పిల్లలు కూడా రిజర్వేషన్లు కోరితే ఈ వ్యవస్థ నుంచి మనం ఎప్పటికీ బయటపడలేం. ఉన్నత స్థాయికి చేరిన వారిని కోటా ప్రయోజనాల నుంచి మినహాయిస్తూ ఇప్పటికే పలు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చాను అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
”విద్యార్థుల తల్లిదండ్రులు మంచి ఉద్యోగాల్లో ఉంటూ, మంచి ఆదాయం సంపాదిస్తున్నా.. వారి పిల్లలు మళ్లీ రిజర్వేషన్లు కావాలంటున్నారు. నిజానికి వారు రిజర్వేషన్ల పరిధి నుంచి బయటకు రావాలి. రిజర్వేషన్ల వల్ల ఒక తరం ఉన్నత స్థాయికి చేరుకున్నాక తదుపరి తరం అర్హతలపై కచ్చితంగా సమీక్ష జరగాలి. అప్పుడే సమాజంలో పరిస్థితి ఉంటుంది అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈడబ్ల్యూఎస్ కోటపై వివరణ
ఇదే సమయంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లపై కూడా కోర్టు మాట్లాడింది. ”ఈడబ్ల్యూఎస్ కోట అనేది కేవలం ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఇస్తుంది. అందులో సామాజిక వెనుకబాటుతనం అనే కోణం ఉండదు అని న్యాయమూర్తి నాగరత్న వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టు సంబంధిత పక్షాలన్నీంటికి నోటీసులు జారీ చేసింది.
పోస్ట్ తల్లిదండ్రులు ఐఎస్లు అయ్యాక..పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు..? మొదట కనిపించింది విశాలాంధ్ర.

