- బ్యాంకాక్లో ఘోర ప్రమాదం
- బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు
- 8 మంది మృతి.. పలువురికి గాయాలు
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో శనివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్ రైలు ప్రజా రవాణా బస్సును ఢీకొట్టడంతో కనీసం 8 మంది మృతి చెందారు.20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఎయిర్పోర్ట్ రైల్ లింక్ స్టేషన్ సమీపంలో సాయంత్రం జరిగింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై బ్యాంకాక్ అత్యవసర వైద్య సేవ సంస్థ ఎరవాన్ మెడికల్ సెంటర్ స్పందించింది. ఇప్పటివరకు 8 మంది వ్యక్తులు.. 20 మందికి పైగా గాయపడినట్టు కనిపించింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
బస్సులోనే మృతదేహాలు
ప్రమాదాన్ని పరిశీలించిన థాయ్లాండ్ ఉప రవాణా శాఖ మంత్రి సిరిపోంగ్ అంగ్కసాకుల్కియాట్ మాట్లాడుతూ.. ”మృతదేహాలన్నీ బస్సులోనే లభించాయి. బస్సులో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.” అని అన్నారు. రైల్వే ట్రాక్పైనే ఆగిపోయిందా? రైల్వే గేట్లు సరిగా మూసుకోలేదా? అన్న దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
వీడియోలు వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. రైల్వే క్రాసింగ్ దగ్గర వాహనాలు వరుసగా నిలిచి ఉండగా.. వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఆరెంజ్ రంగు బస్సును ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్ర ప్రభావంతో బస్సుతో పాటు పక్కనే ఉన్న పలు వాహనాలు కూడా ట్రాక్ల వెంట లాగుకెళ్లాయి. అనంతరం బస్సుకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో అక్కడున్న పలువురు బైక్ రైడర్లు గాల్లోకి ఎగిరిపడి రోడ్డుపై పడిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. మంటలను అదుపులోకి తీసుకున్న అనంతరం సహాయక సిబ్బంది బస్సులోకి ప్రవేశించి సహాయక చర్యలు చేపట్టారు.
థాయ్లాండ్ మీడియా కథనాల ప్రకారం.. గూడ్స్ రైలు దక్షిణ చాచోయెంగ్సావో ప్రావిన్స్ నుంచి బ్యాంకాక్లోని బాంగ్ సూయే వెళ్తోంది. ప్రమాదానికి గురైన బస్సు బ్యాంకాక్ తూర్పు శివార్ల నుంచి నగర కేంద్రానికి నడిచే సర్వీస్గా సూచించబడింది.
ఈ ఏడాది జనవరిలో కూడా బ్యాంకాక్ సమీపంలో ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల కోసం ఉపయోగించే భారీ క్రేన్ ఓ ప్రయాణికుల రైలుపై కూలిపోవడంతో కనీసం 28 మంది మరణించారు.. 60 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘటనపై కూడా థాయ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
వాచ్: థాయ్లాండ్లోని మక్కాసన్ రైల్వే బ్యాంకాక్ వద్ద అగ్ని ప్రమాదానికి దారితీసిన బస్సును రైలు ఢీకొనడంతో అనేక మంది మరణించారు. pic.twitter.com/Bg6nF9IS3E
— రాపిడ్ రిపోర్ట్ (@RapidReport2025) మే 16, 2026

