ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2, బాహుబలి 2, దురంధర్ లాంటివి బాక్సాఫీస్ అద్భుతాలు చేశాయి. అలాని కంటెంట్ లేకుండా తీస్తే ఏమవుతుందో మన్మథుడు 2, కిక్ 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటివి నిరూపించాయి అది వేరే విషయం. రెండు స్థాయిలు బాగా సరిపోతాయి. అలాంటిది పాతికేళ్ల సినిమా ఇప్పుడు కొనసాగితే ఆశ్చర్యమే.
2001లో టబు ప్రధానపాత్రలో చాందిని బార్ వచ్చింది. మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించారు. కమర్షియల్ గా డబ్బులు తేవడమే కాదు జాతీయ అవార్డుతో పాటు బోలెడు పురస్కారాలు గెలుచుకుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో వేశ్యగా నటించడం పట్ల టబు అప్పట్లో కామెంట్స్ ఎదురైన వాటికి తన పెర్ఫార్మన్స్ తో సమాధానం చెప్పి నోళ్లు మూయించింది. ఇప్పుడు రెండున్నర దశాబ్దాల తర్వాత చాందిని బార్ 2 తీసేందుకు రంగం సిద్ధమయ్యిందట.
టబు స్థానంలో ఈ సారి కత్రినా కైఫ్ ఉండొచ్చని బాలీవుడ్ టాక్. అజయ్ బాహ్ల్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పజెబుతారట. సెక్షన్ 375 తీసింది ఈయనే. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే 20001లో యువతగా ఉన్న వాళ్ళు ఇప్పుడు లేట్ ఏజ్ దాటిపోయి ఉంటారు. వాళ్లకు అంత ఆసక్తి ఉండదు. జెన్ జీ కుర్రకారుకు చాందిని బార్ మీద అవగాహన తక్కువ. అసలు మొదటి భాగమే చూసి ఉంటారో లేదో. ఈ రెండు వర్గాలను మెప్పించడం కత్తి మీద సాము లాంటిది.
దర్శకుఢు శంకర్ ఇలాంటి పొరపాటే చేసి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. 1996లో వచ్చిన భారతీయుడికి సీక్వెల్ చేసి బొక్క బోర్ల పడ్డారు. కమల్ హాసనే నటించిన ఆ మేజిక్ రిపీట్ చేయలేకపోయారు. ఇప్పుడు చాందిని బార్ కు అలా జరగకుండా ఉండాలంటే స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టబుతో పాటు చాందిని బార్ లో నటించిన వాళ్ళలో దాదాపు అందరూ ఉన్నారు. వాళ్లలో ఎంతమంది పార్ట్ 2 లో కనిపిస్తారో చూడాలి.

