మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న, సస్పెండ్ అయిన అడిషనల్ ఎస్పీ నాయిని భుజంగరావు నివాసంలో బుధవారం ఏసీబీ అధికారుల సోదాలు జరిగాయి. ఏసిబి ఓ ప్రకటనలో దీనికి సంబంధించిన వివరాలు. అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) సస్పెన్షన్లో ఉన్న అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పి) నాయిని భుజంగరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆదాయ వనరులకు మించి అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు నమోదు చేసినట్లు ఏసిబి ప్రదర్శన. భుజంగరావు నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలు, సహచరులకు మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు అధికారులు నిర్వహించారు. సోదాల్లో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 27.29 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో ఐదు ఖాళీ స్థలాలు, రెండు ఇళ్లు, ఒక వాణిజ్య భవనానికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే రూ.3.83 లక్షల నగదు, రూ.8 లక్షల బ్యాంకు నిల్వ, సుమారు కిలో బంగారు ఆభరణాలు, ఒక మారుతి స్విఫ్ట్ కారు, ఒక కియా సెల్టోస్ వాహనం పేర్కొన్నాయి. ఏసిబి అంచనా ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.5,92,54,500గా ఉంది. అయితే మార్కెట్ విలువ ఇంకా అనేక రెట్లు ఎక్కువగా ఉండొచ్చని ఏసిబి అధికారులు తెలిపారు. భుజంగరావు నివాసంలో 29 మద్యం సీసాలు కూడా లభ్యమయ్యాయని, చర్యల కోసం ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మరిన్ని ఆస్తులపై తనిఖీలు జరుగుతున్నాయని, నిందితుడైన అధికారిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు ఏసిబి టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106 తో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఏసిబిని సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

