గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం వర్ధంతి సభలో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఇపుడు తెలుగునాట చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం టీడీపీలో నిప్పు రాజేసింది. కేవలం వేదిక పంచుకోవడం మాత్రమే కాకుండా అత్యంత సన్నిహితంగా మెలగడాన్ని అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు.
ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బోండా ఉమా పార్టీ మారే అవకాశం ఉందని, త్వరలోనే వైసీపీ గూటికి చేరానని సోషల్ మీడియా కోడై కూసింది. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న సమయంలో బోండా కనుక పార్టీ మారితే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన సీఎం చంద్రబాబు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఇది పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు అందిస్తుందని భావించిన చంద్రబాబు వెంటనే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి రామ నాయుడును రంగంలోకి దించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన టీడీపీ బృందం బోండా ఉమాతో చర్చ జరిగింది. అధిష్టానం అభిప్రాయాన్ని తెలియజేసింది. దీనితో యవ్వారం ముదరక ముందే సమసి పోయింది.
పార్టీ లైన్ దాటేది లేదు…
పార్టీ బృందంతో చర్చించిన ఎమ్మెల్యే బోండా ఉమ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పార్టీ గీత దాటేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని, ఇకముందు వైసీపీ నేతలతో వేదిక పంచుకోకుండా జాగ్రత పడతానని తేల్చి చెప్పారు. దాంతో ఏదో జరిగిపోతుందని ఆందోళన చెందిన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది.
ముందే హెచ్చరించిన చంద్రబాబు…
వైసీపీ నాయకులతో సన్నిహితంగా మెలగ వద్దని సీఎం చంద్రబాబు ముందే చరించి వున్నారు. క్షేత్ర స్థాయిలో కూడా వైసీపీ నాయకులను దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు. వారికి పనులు చేసి పెడితే పాముకు పాలు పోసినట్లేనని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులతో దూరంగా ఉంటున్నారు. ఈ కోరుతున్న ఎమ్మెల్యే బోండా ఉమ వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన అంబటి రాంబాబుతో రాసుకొని పూసుకొని టీడీపీలో కలకలం సృష్టించింది. ఇది తుపానుగా మారకుండా చంద్రబాబు చాణిక్యం ప్రదర్శించడంతో బోండా గండం గట్టెక్కి నట్లయ్యిందని చెప్పొచ్చు.

