భారత్పై పాక్ నిఘా: దశాబ్దాలుగా స్తబ్దుగా ఉన్న తన అంతరిక్షంలో పాకిస్థాన్ ఇటీవల హఠాత్తుగా ఉరకలెత్తుతోంది. చైనా సాయంతో శరవేగంగా ఉపగ్రహాలను ప్రయోగించి, భారత్ సరిహద్దులపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. గత 16 నెలల్లోనే పాకిస్తాన్ ఏకంగా ఆరు భూపరిశీలన ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో ఆప్టికల్ ఇమేజింగ్, హైపర్స్పెక్ట్రల్, అధునాతన రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలు ఉన్న ఉపగ్రహాలు ఉన్నాయి.
సైనిక చర్యల కోసం..
పాక్ అధికారికంగా ఈ ఉపగ్రహాలను పౌర అవసరాలు (వ్యవసాయం, విపత్తు నిర్వహణ, నగరాభివృద్ధి) కోసం అని చెబుతున్నప్పటికీ, నిపుణులు వీటిని సైనిక ప్రయోజనాలకు కూడా వినియోగించే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. హైపర్స్పెక్ట్రల్ ఉపగ్రహం ఏ –1 సాధారణ కెమెరాలు పసిగట్టలేని వస్తువులు, క్యామోఫ్లాజ్లో చేసిన సైనిక వాహనాలు, దాచిన స్థావరాలను కూడా గుర్తించవచ్చు. పీఆర్ఎస్సీ–ఈవో2, పీఆర్ఎస్సీ–ఈవో3 వంటి ఉపగ్రహాలు అధునాతన చిత్రీకరణ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డేటా విశ్లేషణ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి.
ఈ ఉపగ్రహాలు కలిసి పని చేయడం ద్వారా భారత్ సరిహద్దు ప్రాంతాలు, వ్యూహాత్మక స్థావరాలపై నిరంతరం నిఘా ఉంచడం సాధ్యపడుతుంది.
చైనా సహకారంతో..
పాక్ స్పేస్ ఏజెన్సీ గత దశాబ్దాల్లో చాలా నెమ్మదిగా ముందుకు సాగింది. కానీ ఇప్పుడు చైనా రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడం, టెక్నాలజీ బదలాయింపు, ఉమ్మడి అభివృద్ధి ద్వారా వేగం పెరిగింది. రెండు దేశాల మధ్య డేటా షేరింగ్ కూడా జరుగుతోంది. ఈ సహకారం కేవలం అంతరిక్ష రంగానికి మాత్రమే కాకుండా, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
భారత సైనిక కదలికలపై నిఘా..
పాకిస్థాన్ ఈ ఉపగ్రహాల ద్వారా భారత్ సైనిక కదలికలు, సరిహద్దుల్లో మార్పులను నిరంతరం పర్యవేక్షించే సామర్థ్యం ఉంది. ఇది భారత్కు కొత్త సవాలుగా మారనుంది. భారత్ తన స్వంత ఉపగ్రహ నెట్వర్క్ను మరింత వేగంగా విస్తరించింది, కౌంటర్ సర్వైలెన్స్ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ అంతరిక్ష రంగంలో చూపుతున్న ఆకస్మిక చురుకుదనం సాధారణ సాంకేతిక పురోగతి కంటే ఎక్కువగా వ్యూహాత్మక ఉద్దేశ్యాలతో ముడిపడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. చైనా బలమైన టెక్నాలజీతో పాక్ భారత్పై ఆకాశం నుంచి కన్ను వేసే సామర్థ్యం పెంచుకోవడం దక్షిణాసియా భద్రతా సమీకరణలను మరింత క్లిష్టంగా మార్చనుంది.

