– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం పక్కన ఉన్న రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సీపీఐ(ఎం)జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో వియత్నాంపై అమెరికా యుద్ధం ఉధృతంగా సాగుతున్న సమయంలో, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట నేత హోచి మిన్ గౌరవార్థం కోల్కతాలోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల ఉన్న హారింగ్టన్ వీధికి ఆయన పేరు పెట్టారని ఈ సందర్భంగా బేబి గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాలంలో అమెరికా.. ఇరాన్పై యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం, వెనిజులలో సైనిక జోక్యానికి సామ్రాజ్యవాదం, క్యూబాపై ఆంక్షలతో దౌర్జన్యం చేయడం వంటి చర్యల ద్వారా మానవాళిపై దురాక్రమణకు ప్రతీకగా నిలుస్తోంది. నేటి కాలపు హిట్లర్లా మారాలని అమెరికా ఆకాంక్షిస్తున్న ట్రంప్ను గౌరవిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్లోని కాన్సులెట్ పక్కన ఉన్న రహదారికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించడం సరికాదని దుయ్యబట్టారు.
ఇటీవల అమెరికా సైన్యం ఒక నిరాయుధ వాణిజ్య నౌకపై దాడి చేసి ముగ్గురు భారతీయ నావికులను హతమార్చిందని ఆయన ప్రకటించారు. అమెరికా ప్రభుత్వం ఇటువంటి దాడులను బెదిరిస్తున్నప్పటికీ, ఈ దారుణమైన క్షిపణి దాడిపై భారత ప్రభుత్వం తగిన రీతిలో నిరసన వ్యక్తం చేయలేదని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారని అన్నారు. దీన్నిబట్టి దేశ సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోవడానికి బిజెపికి ఎటువంటి సంకోచం లేదని స్పష్టమవుతోందని, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోందని. ఈ వివాదస్పద నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆశిస్తున్నట్లు ఎం.ఎ. బేబి సూచన. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ చేసే తీర్మానాలు కేవలం మాటలకే పరిమితం కాకూడదని, ఆచరణలో చూపాలని ఆయన సూచించారు.
– ప్రకటన –

