Nagababu Rajya Sabha : ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. నలుగురు సభ్యుల పదవీ విరమణతో వారి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కూటమికి ఏకపక్షంగా బలం ఉండటంతో నాలుగు రాజ్యసభ పదవులు చేజిక్కించుకున్నాయి. అయితే ఈసారి నాలుగు రాజ్యసభ పదవులు ఎలా పంచుకుంటారో తెలియడం లేదు. బిజెపికి ఈసారి ఛాన్స్ లేదన్న ప్రచారం జరుగుతోంది. మూడు తెలుగుదేశం, ఒకటి జనసేన తీసుకుంటుంది అన్న టాక్ ఉంది. అయితే జనసేన తొలిసారిగా రాజ్యసభకు ఎవరు వెళ్తారు అనేది ఇప్పుడు చర్చ. అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా పారిశ్రామికవేత్తలతో పాటు సినీ నిర్మాతల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు పేరు తెరపైకి రావడం విశేషం.
* ఏడాది కిందట ఎమ్మెల్సీగా..
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు మెగా బ్రదర్ నాగబాబు. మంత్రివర్గంలోకి తీసుకునే వీలుగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. గతంలో రెండు సార్లు రాజ్యసభకు సంబంధించిన ఖాళీలు వచ్చాయి. ఆ సమయంలో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ వివిధ సమీకరణలో ఛాన్స్ దక్కలేదు. అయితే వెంటనే చంద్రబాబు ఒక ప్రకటన చేశారు. నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే గత ఏడాది మార్చిలో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఆయనకు ఛాన్స్ దక్కే పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాగబాబు రాజ్యసభ పదవి ఆశిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం.
కేంద్ర రాజకీయాలపై ఆసక్తి..
ఎంపీగా కేంద్ర రాజకీయాల్లో ఉండాలన్న బలమైన కోరిక నాగబాబుది. 2019లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు నాగబాబు. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో 2024లో పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అందుకుగాను ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి కేటాయించడంతో సీఎం రమేష్ పోటీ చేశారు. దీంతో నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తరువాత రాజ్యసభ ద్వారా ఎంపీ అని భావించారు. అది కుదరకుండా మంత్రివర్గంలోకి తీసుకుంటానన్న చంద్రబాబు ప్రకటనతో ఉపశమనం లభించింది. అయితే రాష్ట్ర మంత్రిగా కాకుండా కేంద్రమంత్రి కావాలన్నది నాగబాబు ఆలోచన. ఇప్పటివరకు జనసేన కేంద్ర మంత్రివర్గంలో ఎటువంటి పదవులు తీసుకోలేదు. రాజ్యసభకు ఎంపిక కావడం వల్ల కేంద్రమంత్రివర్గంలోకి వెళ్లాలన్నది నాగబాబు ఆలోచన. జనసేన జాతీయ రాజకీయాల బాధ్యత తీసుకోవాలన్నది ప్రణాళిక. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు నాగబాబు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

