- రేవంత్కు హరీష్ రావు సవాల్
- రైతు భరోసాపై లెక్కల యుద్ధం
- సీఎం-డిప్యూటీ సీఎంపై ప్రశ్నలు
- రుణమాఫీ హామీపై కాంగ్రెస్పై విమర్శలు
- ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న హరీష్
శిల్పకళావేదిక సాక్షిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డి రైతుల పేరుతో కొత్త డ్రామాలకు తెరతీశారని పేర్కొన్నారు. రైతు భరోసా పేరుతో కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ, అన్నదాతల అసలు పక్కన పెట్టేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ చేతగాని మాటలు, చెత్త వాగుడు తప్ప వాటి వల్ల రైతులకు కొత్తగా ఒరిగిందేమీ.
ఒకే సభ.. ఇద్దరు నేతలు.. తల ఒక లెక్క
ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లోని డొల్లతనాన్ని హరీష్ రావు ఆధారాలతో సహా ఎండగట్టారు. ఒకే సభలో ఉంటూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రైతుల కోసం రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని, అసలు వీరిద్దరిలో ఎవరి లెక్కలు నిజమని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో చేసింది ఏమీ లేదు కాబట్టే ఇద్దరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 2027 మార్చి 31 వరకు వ్యవసాయ రంగానికి చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులే సుమారు రూ.82 వేల కోట్లు అయితే, జూన్ 2026 నాటికే లక్ష 56 వేల కోట్లు, లక్ష 75 వేల కోట్లు ఎలా ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. బడ్జెట్లో లేని డబ్బును ఖర్చు చేశారా? లేక రైతులను మభ్యపెట్టడానికి కల్పిత లెక్కలు చెబుతున్నారా? అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలను పదిసార్లు చెప్పినా అవి నిజాలు కావని, లేనివి చెప్తే రైతులు నమ్మరని హితవు పలికారు.
రుణమాఫీపై కాంగ్రెస్ మాట మార్చింది
ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చి ఓట్లు అడిగారని, తీరా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కేవలం స్వల్పకాలిక రుణాలకే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను దారుణంగా మోసం చేశారు కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇదే ముందే చెప్పి ఉంటే రైతులు కాంగ్రెస్ను నమ్మేవారా అని అడిగారు. మేనిఫెస్టోలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనమన్నారు.
ఫేక్ ప్రచారాలు చేయడం ఆపి, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో రైతుల కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను ఎలా గాలికి వదిలేశారో, అన్నదాతను ఎలా మోసం చేశారో నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. చర్చించేందుకు కేవలం అసెంబ్లీ మాత్రమే కాదు, ఏ వేదికపైనైనా తాము సిద్ధమని హరీష్ రావు సవాల్ విసిరారు.

