ప్రజాధనంతో మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు
పేద విద్యార్థుల భవిష్యత్, సంక్షేమాన్ని విస్మరించారు
రూ.687.78 కోట్ల టెండర్ను రూ.2,000 కోట్ల కుంభకోణమంటారా?
హరీష్రావు ఆరోపణలపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, అజహరుద్దీన్ ఫైర్
విమర్శలు అవాస్తవం, అబద్ధాలని వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల విద్యార్థుల సౌకర్యాల కల్పన కోసం కొనుగోలు ప్రక్రియపై మాజీ మంత్రి టి. హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవనీ, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలో సమావేశంలో మాట్లాడారు. మొత్తం టెండర్ విలువ రూ.687.78 కోట్లు మాత్రమేననీ, మరి రూ.2,000 కోట్ల కుంభకోణం అనే అంకె ఎక్కడి నుంచి వచ్చిందో హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఆధారాలు ఉంటే సంస్థలకు ఇవ్వాలనీ, విచారణ సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. దోచుకుని దాచుకునే అలవాటు బీఆర్ఎస్ నేతలకే ఉంది. ఈ టెండర్ ప్రక్రియ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్ పోర్టల్ ద్వారా, జాతీయ స్థాయి పోటీ టెండర్ల ద్వారా నిర్వహించబడుతుంది. దేశంలో 27 బిడ్లు వచ్చాయనీ, సాంకేతిక అర్హతలు, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఎల్1 విధానంలో టెండర్లు ఖరారు చేశామని చెప్పారు. ఏ ఒక్క సంస్థకూ నామినేషన్ పద్ధతిలో పనులు ఇవ్వలేదనీ, గుజరాత్ కాంట్రాక్టర్ కథలు పూర్తిగా కల్పితమని.
ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థలు పోటీ పడి టెండర్లు దక్కించుకున్నాయని గుర్తుచేశారు. దక్కించుకుంటున్న వాటిలో గుజరాత్ కంపెనీ అసలే లేదని చెప్పారు. కేంద్రీకృత కొనుగోలు విధానంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వివరించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో లిడ్కాప్కు కేవలం రూ.40.21 లక్షల విలువైన పనులు మాత్రమే ఇచ్చారని చెప్పారు. కానీ మా ప్రభుత్వం కేవలం రెండేండ్లల్లో రూ. 51 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్ ను లిడ్కాప్ ఇచ్చాను. దీని బట్టి ఎవరు ఏ సంస్థలకు పెద్దపీట వేశారో అర్థం చేసుకోవాలని, రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడదన్నారు. తెలంగాణ పేద దేశంలోనే అత్యుత్తమ విద్యా, వసతి, సంక్షేమ సౌకర్యాలు అందించడమే మా లక్ష్యమని. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల మొత్తం ఆర్డర్ను టీజీ ఎల్ఐపీసీకి అప్పగించినట్లు వివరించారు.
యూనిఫాం వస్త్రం, కార్పెట్లు, దుప్పట్లు, బెడ్డింగ్ సామగ్రిలో వాటాను టీజీఎస్సీవోకు కేటాయించినట్లు తెలియజేసారు. నోటు పుస్తకాలను తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు అప్పగించామనీ, 14 మంది మహిళా టైలర్లకు యూనిఫాం కుట్టు పనులు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. 27 లక్షల మంది విద్యార్థులకు తొలిసారిగా సమగ్ర సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా గురుకులాలు, కేజీవీలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరీతి నాణ్యతతో కూడిన సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. తెల్లటి యూనిఫాం, తెల్లటి బూట్లు, తెల్లటి సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, ట్రంక్ బాక్స్, బెడ్డింగ్ కిట్, పీటీ డ్రస్, నైట్ డ్రస్ వంటి సమగ్ర కిట్ అందజేస్తున్నామని తెలిపారు. డైట్ ఛార్జీలు,కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలన్నారు. టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది బకాయిలు చెల్లిస్తున్నామనీ, అద్దె భవనాల బిల్లులను ప్రతినెలా సకాలంలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్య పనుల కోసం కలెక్టర్లకు ప్రత్యేక నిధులు అందుబాటులో ఉంచామన్నారు.
పోస్ట్ దోచుకుని దాచుకున్నారు మొదట కనిపించింది నవతెలంగాణ.

