ఆంధ్రప్రదేశ్: తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు కట్టుబాటు తప్పుతున్నారు. ఆడియో లీకులు, వీడియోలు విడుదలవుతున్నట్లు తెలిసి కూడా కొందరు ఎమ్మెల్యేలు ఆవేశంతో చేస్తున్న పనులు పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. ఇటీవల చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక కాంగ్రెస్ నేతతో భూ వివాదంపై రిటైర్డ్ జడ్జిపై బూతు పురాణం సంచలనంగా మారింది. వంద కోట్ల విలువైన భూమి విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఫోన్ కాల్ సారాంశం. అయితే గత వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు టీడీపీ అధినేత చంద్రబాబు చేశారో అదే తప్పిదం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ కనపడుతున్నాయి. దీంతో రెండు ప్రభుత్వాలకు పెద్దగా తేడా ఏముందన్న ప్రశ్నలు జనాల్లో మెదులుతున్నాయి.
పులివర్తి నాని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదీ చంద్రబాబు తొలిసారి పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చిన చంద్రగిరి నియోజకవర్గంలో గెలిచి సత్తా చాటారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీకి గెలుపు దక్కలేదు. అలాంటి నియోజకవర్గంలో 2024లో పులివర్తి నాని ఆ బ్యాడ్ రికార్డును బద్దలు కొట్టి అందరి దృష్టిలో పడ్డారు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొన్ని ఎన్నికలుగా గెలుస్తూ వస్తున్నారు. చంద్రగిరి తన అడ్డాగా చెవిరెడ్డి భావించారు. అలాంటి చోట గెలిచిన పులివర్తి నాని చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఈ భూ వివాదంలో ఎందుకు ఇరుక్కున్నారన్నది ఇప్పటికీ టీడీపీ నాయకత్వానికి అర్థం కానీ ప్రశ్నగానే ఉండిపోయింది. చంద్రబాబు, లోకేశ్లకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడినపులివర్తి నాని చంద్రగిరిలో తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది.
కానీ పులివర్తి నాని తొలిసారి గెలిచిన తర్వాత వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఒక కుటుంబానికి చెందిన భూమిని రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ స్థలం తమదేనని పులివర్తి నాని వర్గీయులు వాదిస్తున్నారు. తిరుపతిలో కూటమి రెండేళ్ల విజయోత్సవ సభవిజయవంతం కావడం చూసి ఓర్వలేక కొందరు ఇలా పులివర్తి నానిపై కుట్రలు పన్నుతున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగింది. ఒక వృద్ధ దంపతులు మీడియా ముందుకు రావడం, రిటైర్డ్ ఆర్డీవో కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ విషయాలు వెల్లడించడంతో టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు సొంత జిల్లాలోనే భూ వివాదాలకు టీడీపీ నేతలు కేరాఫ్ గా మారుతుండటం కొంత పార్టీకి ఇబ్బందికరమైన పరిణామమేనని సీనియర్ నేతలు కూడా అంటున్నారు. మరి రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది చూడాలి.

