రాజన్న సిరిసిల్ల జిల్లా: సోమవారం ఆరుద్ర నక్షత్ర సందర్బంగా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. 20 సంవత్సరాలకొక్కసారి ఈ రోజు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో భక్తులు తరలివెళ్లారు. ఇవ్వాళ శివుని దర్శించుకుంటే పాపాలు విముక్తి అయి పుణ్య ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. కోడె మొక్కుల కోసం భక్తులు బారులు తీరారు. భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కూడా వరుస సెలవుల కారణంగా ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో.. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, పుష్కరిణి, పార్కింగ్ ప్రాంతాలు కిక్కిరిసిపోగా, స్వామివారి ధర్మ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పట్టింది.
భక్తుల వాహనాలు భారీగా రావడంతో కొండపై పార్కింగ్ నిండిపోవడంతో ఘాట్ రోడ్డు సర్కిల్, రింగు రోడ్డుల్లో వాహనాలు బారులు తీరాయి. నిర్వహించిన సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణంలో విశేషంగా హాజరైన భక్తులు సమర్పించిన పూజలు, ప్రసాద విక్రయాలు, ఆలయం టిక్కెట్లు, వాహన రుసుముల ద్వారా ఆదివారం ఒక్క రోజే రూ. 68,22,052 ఆదాయం సమకూరినట్లు అధికారులు గుర్తించారు.

