హైదరాబాద్లో హత్య: హైదరాబాద్లోని మాదాపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వేధింపుల వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. రామేశ్వరం కేఫే ఎదుట భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో మాధాపూర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం.. భాస్కర్ ఇద్దరు యువతులను వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అప్పట్లో కౌన్సె పోలీసులు నిర్వహించే వర్గాలకు భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఈ మధ్యకాలంలో భాస్కర్ “దమ్ముంటే హైదరాబాద్కు రండి” అంటూ సవాల్ విసిరినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన యువతుల తండ్రి, మరో వ్యక్తితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి పథకం ప్రకారం దాడి చేశారు. హత్య అనంతరం నిందితులిద్దరూ స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. డయల్-100కు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఘటనాస్థలికి క్లూస్ టీం చేరుకుని కీలక ఆధారాలను సేకరించింది. అనంతరం భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వేధింపుల వివాదమే ఈ హత్యకు కారణమా.? లేదా ఇతర కోణాలు కూడా ఉన్నాయా.? అనే అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.

