OTR: అసెంబ్లీలో మైక్ పట్టుకుని అధ్యక్షా.. అంటే ఆ కిక్కే వేరబ్బా అని ఆ ప్రజాప్రతినిధుల ఫీలవుతున్నారా? ప్రస్తుతం తాము ఉన్న పదవులపై వాళ్ళు అంత సంతృప్తిగా లేరా? అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలా? ముందే కర్చీఫ్ వేసేందుకు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఆ నాయకులు ఎవరు? అలాంటి విషయాల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన ఎలా ఉంది?
తెలంగాణలో ఎన్నికల సాధారణకు ఇంకో రెండున్నరేళ్ళ సమయం ఉంది. అయినా… ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని అనుకున్న నాయకులు ఇప్పట్నుంచే పావులు కదపడం మొదలుపెట్టారు. ఆ విషయంలో బీఆర్ఎస్ నేతలు కాస్త ముందున్నట్టు ఉన్నారు. మరీ ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీలు కొందరు ఈసారి శాసనసభకు పోటీచేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం వాళ్ళు పెద్దల సభకు నిర్వహిస్తున్నారు… మనసంతా అసెంబ్లీ వైపే ఉన్నట్టు. శాసన మండలి సభ్యులుగా ప్రజా సమస్యలు లేవనెత్తుతున్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ఆ కిక్కే వేరన్నది వారి అభిప్రాయం.
ఆరుగురు గులాబీ ఎమ్మెల్సీలు అయితే… ఆల్రెడీ తమ నియోజకవర్గాలను కూడా ఎంపిక చేసుకుని అక్కడ టూర్ ప్రోగ్రామ్లు పెడుతున్నారట. స్థానికంగా కార్యకర్తలకు టచ్లో ఉండటం, మంచి చెడులకు అటెండ్ అవడం లాంటివి చేస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే పార్టీ పిలుపునిచ్చే ప్రోగ్రామ్లను సక్సెస్ చేయడానికి నియోజకవర్గ ఇంచార్జ్ల కంటే ఈ ఎమ్మెల్సీలే ఎక్కువగా కష్టపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎస్ఐఆర్ పై సన్నాహక సమావేశాల్లో కూడా వీళ్ళే యాక్టీవ్ రోల్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న శంభీపూర్ రాజు ఈసారి శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఎస్ ఐ ఆర్ ఇంచార్జిగా కూడా ఉన్న ఆయనకు అధిష్టానం నుంచి క్లియరెన్స్ వచ్చిందని అంటున్నారు. ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS తరుపున గెలిచిన నవీన్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో షాద్ నగర్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకోసం ఆయన స్థానికంగా జరిగే కార్యక్రమాలకు హాజరు అవుతూ వస్తున్నారు.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తాత మధు ఈసారి పాలేరు నుంచి పోటీ చేయాల్సిందేనని గట్టిగా ఉన్నారట. పార్టీలో మొదటి నుంచి ఉన్న ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు పాలకుర్తి టికెట్ నాదేనని చెబుతున్నారు. ఇటు నల్గొండ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన ఉమ్మడి కోటిరెడ్డి ఎప్పటినుంచో నాగార్జున సాగర్ టిక్కెట్పై ఆశ పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధిష్టానం తనకే ఇస్తుందని నమ్మకంగా ఉన్నారట. మరోవైపు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న మధుసూదనాచారి గతంలో ప్రాతినిధ్యం వహించిన భూపాలపల్లిని మళ్ళీ ఆశిస్తున్నారు.
ఇలా వీరితోపాటు మరి కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా తాము స్థానికంగా ఉండే నియోజకవర్గంలో ఇప్పటినుంచే నాయకులను కలవడంతో పాటు పోటీ చేస్తున్న తన మనసులో మాట బయటపెడుతున్నారట.గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓడిపోయామని చెబుతూ వస్తున్నారు గులాబీ నేతలు. అయినప్పటికీ వారినే నియోజకవర్గాల ఇన్చార్జిలుగా కొనసాగిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎవరిని కొనసాగించాలో వచ్చే ఎన్నికల నాటికి తమకే టికెట్లు వస్తాయని ఎమ్మెల్సీలు చెబుతున్నట్టు సమాచారం. ఇదే సందర్భంలో ప్రస్తుతానికి ఎవరికీ టికెట్లు ఇస్తామని గ్యారంటీ ఇవ్వలేదని,అందరూ గ్రౌండ్ లో పనిచేయాల్సిందేనని అంటోంది. ఇప్పుడు ఎవరు కార్యక్రమాలు చేసినా, టికెట్టు మాదేనని ప్రకటించుకున్నా.. ఎన్నికల ముందు సర్వేల ఆధారంగానే ఇవ్వాలన్నది పార్టీ పెద్దల ఆలోచనగా జరగాలన్నది.

