రీరిలీజుల ట్రెండ్ జనాలకు మొహం మొత్తిపోయేలా విసిగిస్తోంది. వారానికి ఒకటి రెండు క్రమం తప్పకుండా వీటిని వదులుతూ డిస్ట్రిబ్యూటర్ లాభపడుతున్న దానికన్నా నష్టపోతున్న వైనమే ఎక్కువగా ఉంది. స్టార్ హీరోల సినిమాలను కొంత వరకు సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మిడ్ రేంజ్ హీరోలవి, అందులోనూ యావరేజ్ తీసుకుంటే పబ్లిసిటీ ఖర్చులు కూడా రావు. గోపీచంద్ గౌతమ్ నందాకు వచ్చిన స్పందనే దానికి ఉదాహరణ.
ఇప్పుడో కొత్త ట్విస్ట్ ఏంటంటే ఆరుగురు పతివ్రతలని మళ్ళీ థియేటర్లకు తెస్తున్నారు. ఈవీవీ సత్యనారాయణగారి దర్శకత్వంలో వచ్చిన ఈ డిఫరెంట్ డ్రామా 2004లో ఫ్లాప్ గా నిలిచింది. భార్యల మీద భర్తలకున్న మానసిక రుగ్మతలను కాసింత పచ్చిగా చూపించారు. ఆమె తరహాలో సెన్సేషన్ అవుతుందనుకుంటే నిరాశ పరిచింది. ఇలాంటి షాకింగ్ కంటెంట్ కి కొందరు కొత్త ఆర్టిస్టులను దీని ద్వారా పరిచయం చేయడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
కాలక్రమేణా ఆరుగురు పతివ్రతలలో సీన్లు జెన్ జీకి నచ్చడం మొదలయ్యింది. వాటి క్లిప్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో అదే పనిగా ఈ సినిమా యూట్యూబ్, ఓటిలో చూసిన వాళ్ళు చాలానే ఉన్నారు. ఇది ఈవీవీ నిర్మాతగా తీసిన సొంత సినిమా. సహజంగానే హక్కులు ఆయన పిల్లలు అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ దగ్గర ఉంటాయి. అవి కొనుగోలు చేసే ఈ నెలలో రీ రిలీజ్ కు రంగం సిద్ధం చేశారట డిస్ట్రిబ్యూటర్లు.
అంతా బాగానే ఉంది కానీ నిజంగా ఆరుగురు పతివ్రతలను జనాలు థియేటర్ కు వెళ్లి చూస్తారా అంటే అనుమానమే. ఎందుకంటే స్టార్లు, సెలబ్రేట్ చేసుకునే సాంగ్స్ లేకుండా ఇలాంటి సినిమాలను బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయడం కొంచెం కష్టమే. ముఖ్యంగా థియేటర్ లోపల రీ క్రియేషన్స్ చేసుకునే బ్యాచులకు ఈ మూవీ ఎలాంటి అవకాశం ఇవ్వదు. ఈవివి గారు బ్రతికి ఉంటే ఇప్పటి యూత్ దీన్ని ఇంతగా ఓన్ చేసుకోవడం చూసి ఎంత ఆశ్చర్యపోయేవారో.

