విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు ఆయన హాజరయ్యారు. స్థానిక విద్యానగర్లోని తన నివాసంలో గురువారం ఆయన తన ఓటరు పత్రాన్ని స్వయంగా నింపి అధికారులకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విజయవంతం కావడానికి ఎన్నికల అధికారులు, బీఎల్వోలకు ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని సూచించారు. రాజకీయ పక్షాలు, ఆయా పార్టీల తరపున నియమితులైన బీఎల్వోలు కూడా చురుగ్గా పాల్గొని సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి పౌరునికి ఓటు హక్కు అనేది అత్యంత విలువైన ఆయుధమన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత ఓటుపైనే ఉంటుందని స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా ఓటరుగా నమోదు చేసుకోవడంతోపాటు జాబితాలో తప్పులుంటే సవరించుకోవాలని సూచించారు. మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి మురళి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జనార్ధన్, ఆర్ఐ జి.నరసింహారావు, వీఆర్వోలు బాలాజీ, నాగరాణి ఉన్నారు.

