నిజమే… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కూడా ఏపీలో అధికారులు పని చేయడం లేదని చెప్పక తప్పదు. మంత్రులు ఆదేశాలు జారీ చేసినా పనులు జరగడం లేదంటే… అధికారులు పని చేయనట్టే కదా. ఈ తరహా అధికారుల తీరుపై స్వయంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జనసేనకే చెందిన కీలక నేత, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ మాదిరే అధికారుల తీరుపై మండిపడ్డారు. కాదండోయ్…తాను చెప్పిన పనిని అధికారులు చేయలేదని గ్రహించిన నాదెండ్ల స్వయంగా 2 గంటల పాటు నడిరోడ్డుపై కూర్చుని మరీ సిబ్బందితో పని చేశారు.
ఈ ఘటన బుధవారం నాదెండ్ల జరుగుతున్న తెనాలి నియోజకవర్గ పరిధిలోనే జరిగింది. తెనాలి శాసనసభ్యుడిగా ఉన్న నాదెండ్ల రెండు రోజుల క్రితం పట్టణంలో ఓ ప్రదేశంలో పేరుకుపోయిన చెత్తను అధికారులు చూపించారు. ఆ చెత్తను తక్షణమే తొలగించాలని, పట్టణంలోని అన్ని ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి చెప్పినప్పుడు వినయంగా సరేనని చెప్పిన అదికారులు… మంత్రి అటు వెళ్లగానే వీరూ ఇటు వెళ్లిపోయారు. ఎక్కడి చెత్త అక్కడే అన్నట్టుగా పరిస్థితి మారింది.
తాజాగా బుధవారం కూడా తెనాలిలో గడిపిన నాదెండ్ల రెండు రోజుల క్రితం తాను తిరిగిన ప్రదేశం నుంచే వెళ్లారు. ఈ సందర్భంగా తాను తీసేయమని చెప్పిన చెత్త చెదారం అక్కడే ఆయనకు కనిపించింది. అంతే మునిసిపల్ అదికారులను పిలిచిన నాదెండ్ల.. ఇదేంటి?.. ఈ చెత్త ఇంకా ఇక్కడ ఉందా?. తీసివేయమని చెప్పా కదా అంటూ ఆరా తీశారు. మంత్రి తమ అసలత్వాన్ని గుర్తించారని తెలుసుకున్న అధికారులు… టెండర్లు పిలిచి చెత్త తీసి తమను తాము కవర్ చేసుకునే యత్నం చేశారు.
అదికారుల నుంచి అలాంటి సమాదానం ఆశించని నాదెండ్ల… మునిసిపాలిటీలో చెత్త చెదారాన్ని తీసివేసేందుకు పురపాలక సంస్థకు ట్రాక్టర్లు ఉన్నాయి, జేసీబీలు ఉన్నాయి కదా… మరి చెత్త తీసివేసేందుకు టెండర్లు ఎందుకు? అని ప్రశ్నించారు. పట్టణంలోని చెత్తను తీసివేసేందుకే కదా ట్రాక్టర్లు, జేసీబీలు కొన్నది అని కూడా మంత్రి గుర్తు చేశారు. అయినా ఇంకా అదికారులు నీళ్లు నములుతున్న వైనాన్ని చూసి మరింత ఆగ్రహానికి గురైన నాదెండ్ల… ఆ చెత్తను తీస్తే తాను ఇక్కడి నుంచి కదలనని రోడ్డు మీద నిలబడిపోయారు. దీంతో పరుగు లంకించుకున్న అధికారులు.. అప్పటికప్పుడు పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించి ఆ చెత్తను తొలగించారు.

