భారత్ ను వేలెత్తి చూపే ముందు…ఇంట గెలవండి: పర్వతనేని హరీశ్ చురక
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్ను వేలెత్తి చూపే ముందు ఇంత గెలవాలని చురకలంటించింది. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా ఉపయోగిస్తోన్న పాక్…అసత్య ప్రచారంతో అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. సింధూ జలాల ఒప్పందంపై తమ విధానంలో ఎటువంటి మార్పు లేదని భారత్ మరొక్కసారి తేల్చిచెప్పింది. ఐరాస భద్రతా మండలిలో జరిగిన ఉన్నతస్థాయి చర్చ సందర్భంగా పాక్ కశ్మీర్ లేవనెత్తింది. దీంతో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ దాయాదికి దీటుగా బదులిచ్చారు. ఈ చర్చలో ఇతర అంశాలను ప్రస్తావించడం తమ ఉద్దేశం కాదని, కానీ పాక్ తప్పుడు ప్రచారం కోసం ఈ వేదికను దుర్వినియోగం చేస్తుందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమనేది న్యాయమైన వాస్తవమని గుర్తుచేశారు. కశ్మీర్కు సంబంధించి మిగిలి ఉన్న ఏకైక సమస్య పీఓకే మాత్రమేనని స్పష్టం చేశారు. సింధూ జలాల ఒప్పందంపై తమ విధానంలో ఎటువంటి మార్పు లేదని భారత ప్రతినిధి పునరుద్ఘాటించారు. పరస్పర విశ్వాసం, సత్సంకల్పంతో రెండు దేశాల మధ్య సహకారం సాధ్యమవుతుంది. అయితే సీమాంతర ఉగ్రదాదులకు తాగుతున్న పాక్…ఇలాంటి ఒప్పందాల నుంచి ప్రయోజనాలను కోరుకోవడం సరికాదని దుయ్యబట్టారు.

