ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు రోడ్డున పడ్డారు. సాక్షాత్తు అధినేత చెప్పినా వినడంలేదట. ఎవరు బాసు.. ఎవరికి బాసు. అంటున్నారట తెలుగు తమ్ముళ్లు. పంచాయితీ జరిగి రెండు రోజులైనా కాలేదు మళ్లీ రోడ్డెక్కేశారట. పెత్తనం తనదేనని ఎమ్మెల్యే అంటూ ఉంటే… అంత సీన్ లేదంటూ ఇన్చార్జ్ బాహాబాహీగా దిగుతున్నారట. వారి మాటలతో పరువు పోతోందని ఇతర నేతలు తలలు పట్టుకుంటున్నారట. కనీసం పెద్దబాసు చెప్పినా వినకపోవడం ఏంటని సీనియర్ నేతలు కూడా స్థానిక నేతలపై రగిలిపోతున్నారట. ఈ పరిస్థితిపై సీరియస్ యాక్షన్ లేకపోతే ప్రయోజనం శూన్యం అనే మాట గట్టిగానే వినపడుతోందట.
సత్యవేడు నియోజకవర్గ టీడీపీలో ఆధిపత్య పోరు ఓ రేంజ్లో జరుగుతోంది. నియోజకవర్గ ముఖ్య నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు రోడ్డుకెక్కాయి. ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం, ఆయన కుమారుడు సుమన్ ఒకవైపు… పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి తిరిగి అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. ఇరువర్గాల మధ్య సఖ్యత కరువై… రోజురోజుకూ గ్యాప్ పెరుగుతూనే ఉంది. ఏడాదిగా సాగుతున్న సత్యవేడు టీడీపీ పంచాయితీని డీల్ చేసేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. శ్రీసిటీలో జరిగిన అంతర్గత సమావేశంలో సత్యవేడు నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీకి చేకూర్చే చర్యలను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని గట్టిగా చెప్పారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం, ఆయన కుమారుడు సుమన్, నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డితో సీఎం విడివిడిగా మాట్లాడి ఇరువర్గాలు సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించారు. గత హయాంలో మట్టి అక్రమ రవాణా వల్ల వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సైతం తమిళనాడుకు మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ రవాణాను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినా, స్థానిక నేతల కమీషన్ల దందానే ఈ గొడవలకు ప్రధాన కారణమన్న టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని కొందరు, ఇన్ఛార్జ్ పేరుతో మరికొందరు నియోజకవర్గానికి వెళ్లేందుకు ప్రయత్నించేందుకు ప్రయత్నించిన క్యాడర్ తీవ్ర గందరగోళంలో పడింది.
అధినేత వార్నింగ్ ఇచ్చి రెండు రోజులు కూడా కాకముందే సత్యవేడు తెలుగు తమ్ముళ్లు మళ్లీ రచ్చకెక్కారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రెస్ మీట్లు పెట్టే వరకు వెళ్లారు. ప్రజల్లో టాక్ ఎలా ఉందంటే.. వీళ్లకు అధినేత మాట కంటే సొంత పెత్తనమే ఎక్కువైందా అనే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెత్తనం తనకే ఇచ్చారని, తానే సుప్రీం అని ఎమ్మెల్యే, ఆయన కుమారుడు, వారి అనుచరులు ప్రచారం చేయడం రచ్చకు దారితీసిందట. అధినేత ఇరువర్గాలను సమన్వయంతో పనిచేయాలని సూచించినా… ఎమ్మెల్యే మాత్రం తామే సర్వాధికారులమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రహించిన కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి అంతకంటే గట్టిగా కౌంటర్ ప్లాన్ చేశారట. నియోజకవర్గాలు, పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ బాధ్యతలు తనవే అంటూ శంకర్ రెడ్డి తేల్చిచెప్పారు. ఈ ప్రెస్ మీట్లో కేవలం శంకర్ రెడ్డి మాత్రమే కాకుండా, జిల్లా పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మిని సైతం కూర్చోబెట్టి మరీ మాట్లాడడం నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారితీసిందట. బాధ్యత నియోజకవర్గాల్లో ఎటువంటి మార్పులు జరగలేదని, పార్టీ అధిష్ఠానం నుంచి కొత్తగా ఎలాంటి ఆదేశాలు రాలేదని పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. అధిష్ఠానం నియమించిన ఇన్ఛార్జ్లు, కోఆర్డినేటర్ను పక్కనపెట్టి కొందరు నాయకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయాలని, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ,
ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ మధ్య నడుస్తున్న ఆదిపత్య పోరుతో గ్రౌండ్ రియాలిటీ దారుణంగా తయారైంది. మొన్నటికి మొన్న నారా లోకేష్ శ్రీసిటీలోనే పంచాయితీ చేస్తే… తాజాగా చంద్రబాబు స్వయంగా ఆదేశాలు ఇచ్చినా కూడా… తమ్ముళ్ల తీరు మారలేదనే మాట సత్యవేడులో వినిపిస్తోంది. అధినేత మాటకు కూడా విలువ లేకుండా పోయిందని జిల్లా టీడీపీలో పెద్ద చర్చే జరుగుతోందట. ఇప్పుడే ఇలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి ఏంటని మదనపడుతున్నారట కార్యకర్తలు. ఈ పంచాయితీలతో సామాన్య కార్యకర్తకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్లాలా.. లేదంటే కోఆర్డినేటర్ ఆఫీస్కి వెళ్లాలా..? అనేది తేల్చుకోలేక కేడర్ సతమతమవుతోందట. నియోజకవర్గంలో గ్రూప్ వార్ వల్ల ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడంలేదట. అభివృద్ధి పనులు కూడా అనుకున్నంత వేగంగా సాగడం లేదనే చర్చ నడుస్తోంది.

