. అంతర్ రాష్ట్ర సమన్వయంతో సమస్యకు శాశ్వత పరిష్కారం
. తెలంగాణ-కర్ణాటక మధ్య కృష్ణా జలాల వినియోగంపై కీలక భేటీ
విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా ప్రాజెక్టుల శాఖ రూపకల్పన ఉండాలని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉత్తమ్ కుమార్ తో కర్ణాటక చిన్ననీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజులు భేటీ అయ్యారు. తెలంగాణ -కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగు నీటి అవసరాలపై కీలక సమావేశం జరిగింది. ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే రీతిలో సాగు, ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చలు జరిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణానదిపై ప్రాతిపదిక బ్యారేజ్ నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా చర్చలు జరిపామని, తెలంగాణ సాగునీటి హక్కులు, భవిష్యత్ అవసరాల పరిరక్షణ అవశ్యమన్నారు. కృష్ణా జలాల సమన్యాయ వినియోగంపై రాష్ట్ర హక్కులను కాపాడుకునే చర్చలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అంతర్ రాష్ట్ర సమన్వయంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. తెలంగాణ రైతాంగం సాగునీటి అవసరాలకు సంబంధించిన చర్చలకు పూర్తి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. పరస్పరం కృష్ణా జలాల వినియోగం జరుగుతున్నది. రెండు రాష్ట్రాల అవసరాలపై కలిసి పోయే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, రాయచూరు లోక్సభ సభ్యులు జీ కుమార్ నాయక్, నాగర్ కర్నూల్ లోకసభ సభ్యులు మల్లు రవి, రాయచూరు రూరల్ శాసనసభ్యులు బసవన్న గౌడ, ఉమ్మడి పాలమూరు శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ,మేఘారెడ్డి, రాజేష్ రెడ్డి, కార్యదర్శి శివకుమార్, నీటి వంశీ కృష్ణ రెడ్డి. శ్రీదర్, సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్, ఇ.ఎన్.సి.రమేష్, కర్నాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ కార్యదర్శి బీకే.పవిత్ర నియామకం జరిగింది.

