పాకిస్థాన్లో 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారాను కూల్చివేశారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్లో ఒక స్థానిక వ్యాపారవేత్త ఈ చారిత్రక గురుద్వారాను కూల్చివేయడంతో.. ఆ ప్రాంతంలోని మైనారిటీ సిక్కు వర్గం నిరసనలు వ్యక్తం చేసింది. పవిత్ర సిక్కు పుణ్యక్షేత్రమైన ‘గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ సాహిబ్’పై జరిగిన ఈ చర్యను తీవ్రంగా ఖండించిన భారత్.. ఇది ఉద్దేశపూర్వక విధ్వంసక చర్యేనని మండిపడింది.
ఈ కూల్చివేత ఘటనపై, ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) ప్రతినిధి బృందం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను కలిసింది. గురుద్వారాకు ఇకపై ఎటువంటి కూల్చివేత లేదా నష్టం జరగకుండా చూడాలని కోరుతూ వారు ప్రభుత్వానికి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
‘గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ సాహిబ్’ అనేది లాహోర్కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరూఖ్బాద్లో ఉన్న దశాబ్దాల నాటి చారిత్రక పుణ్యక్షేత్రం. సంఘటనాస్థలానికి సందర్శించిన పంజాబ్ మైనారిటీ వ్యవహారాల మంత్రి రమేష్ సింగ్ అరోరా.. గురుద్వారాను తక్షణమే పునరుద్ధరిస్తుంది ఆ గురుద్వారా ఉన్న భూమి యాజమాన్యం, స్థితిగతులపై తక్షణమే విచారణ జరపాలని ‘ఔకాఫ్’ (Auqaf) శాఖను సూచించినట్లు తెలిసింది.

