సూరి దారుణ హత్య: హైదరాబాద్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి టీకేఆర్ కళాశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షలు, ప్రతీకారమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందనవనం సూరిపై గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం అతనిపై నగర బహిష్కరణ కూడా విధించారు. గతంలో తన భార్యతో పాటు సల్మాన్ హత్య కేసులో సూరి నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని సల్మాన్ సోదరుడు ఆఫ్రోజ్ పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుక ఉందంటూ అఫ్రోజ్, సూరిని టీకేఆర్ కాలేజ్ సమీపానికి పిలిపించినట్లు సమాచారం. అక్కడికి చేరుకున్న వెంటనే ముందుగా అతని కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి ప్రతిఘటించే అవకాశం లేకుండా చేశారు.
పెప్పర్ స్ప్రే చల్లిన తర్వాత ఆఫ్రోజ్తో పాటు మరికొందరు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయిన సూరిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, మీర్పేట్ ఇన్స్పెక్టర్ శోభనతో పాటు పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య వెనుక వ్యక్తిగత కక్షలు, గతంలో జరిగిన హత్య కేసుకు సంబంధించిన ప్రతీకారమే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఆఫ్రోజ్తో పాటు ఘటనలో పాల్గొన్న ఇతర నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

