ఆంధ్ర ప్రదేశ్ : వైసీపీ కాపు సామాజికవర్గం నేతల్లో పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలవడమే కాకుండా పార్టీ అధికారంలోకి వస్తే తనకు కేబినెట్ పదవి దక్కుతుందన్న భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. అందుకే ఇప్పుడు కాపు సామాజికవర్గం వైసీపీ నేతల వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. మిగిలిన సామాజికవర్గం నేతలు పెద్దగా కనిపించడం లేదు. గతంలో మంత్రులుగా పనిచేసిన రెడ్డి, ఎస్సై, ఎస్టీ, కమ్మ సామాజికవర్గం నేతలు కూడా వైసీపీ తరుపున బయటకు వచ్చి మాట్లాడటం లేదు కానీ.. కాపు సామాజికవర్గం నేతలు మాత్రం హైలెట్ కావడానికి విపరీతంగా ప్రయత్నించారు. అందుకు ప్రధాన కారణం వచ్చే ఎన్నికల్లో గెలిస్తే పదవి కోసమేనన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు సామాజికవర్గం నేతలకు జగన్ తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆళ్ల నాని వంటి వారు మంత్రి పదవిని జగన్ మంత్రివర్గంలోపొందారు. ఆళ్ల నాని పార్టీ నుంచి వెళ్లిపోయినా మిగిలిన నేతలుమాత్రం పార్టీలోనే ఉండిపోయారు. ఎవరూ ఇతర పార్టీల్లోచేరేందుకు కూడా ప్రయత్నించలేదు. సహజంగా జనసేన లోకి వెళ్లాల్సిన నేతలు కూడా వైసీపీలోనే ఉండిపోయారు. ఇక వెళ్లే అవకాశం కూడా లేకపోవచ్చు. అయితే ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ కాపు నేతల్లోనే పదవి కోసం రేసు మొదలయినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా చూసిన వారికి ఎవరికైనా ఇదే భావన అనిపించింది.
వైసీపీ ఓటమి పాలయి పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత కాపు నేతలే ఎక్కువ గళం విప్పుతున్నారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా హైలెట్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తోట త్రిమూర్తులు సీనియర్ నేత. అందుకే ఆయన ఇటీవల తన ఇలాకాలో వైసీపీ కాపు నేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. అందులో తోట త్రిమూర్తులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముద్రగడ పద్మనాభం వంటి నేతలు అనారోగ్యంతో బాధపడుతుండటంతో తోట త్రిమూర్తులు కాపు సామాజికవర్గాన్ని వైసీపీకి దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద వైసీపీలో ఇతర సామాజికవర్గాల కంటే కాపు సామాజికవర్గం నేతల హడావిడే ఎక్కువగా కనిపిస్తుంది. మరి కాపు నేతల్లో ఎవరు రేసులో ముందుంటారన్నది కాలమే తేల్చాల్సి ఉంది.

